హైదరాబాద్, వెలుతురు జూలై 20 :
దళితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఆయన సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు దళిత సంక్షేమ అంశాలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం అమలు, ఎస్సీ అసైన్డ్ భూముల పరిరక్షణ, లిడ్ క్యాప్ భూములకు సంబంధించిన సమస్యలు, దళితుల హక్కులు, పెండింగ్లో ఉన్న వివిధ అంశాలపై ఆయన స్పీకర్తో సమగ్రంగా చర్చించారు.
దళితులకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని స్పీకర్ను కోరారు. దళితుల హక్కుల పరిరక్షణతో పాటు భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించి, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహా శక్తి రాష్ట్ర నాయకులు , ముంజగల్ల విజయ్ కుమార్, స్పెన్ రెడ్, ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.