హైదరాబాద్ వెలుతురు జూలై 21
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మాజీ సీబీఐ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరరావు స్పందించారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా విస్తృతంగా స్పందిస్తూ ఉదయ్ కృష్ణారెడ్డికి న్యాయం జరగాలని కోరారు. ప్రేమ సంబంధం విఫలమైతే దానిని నేర కేసుగా మార్చకూడదని, పూర్తి స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని విజ్ఞప్తి చేశారు.
మహిళా ఐపీఎస్ ప్రొబేషనర్ సుమా హెచ్.కే. తన సహ శిక్షణార్థి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులు, దాడి వంటి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా ఖండిస్తున్నారని, వారి మధ్య సంబంధం పరస్పర అంగీకారంతో కొనసాగిందని, తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన వాదిస్తున్నట్లు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంలో రెండు భిన్నమైన వాదనలు ఉన్నందున, ప్రజాభిప్రాయం ఆధారంగా కాకుండా ఆధారాలపై దర్యాప్తు జరగాలని సూచించారు.
ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం వేలాది గ్రామీణ యువతకు స్ఫూర్తిదాయకమని నాగేశ్వరరావు తన పోస్టులో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని పేద కుటుంబంలో జన్మించిన ఉదయ్ చిన్నతనంలోనే తల్లిని, యవ్వనంలో తండ్రిని కోల్పోయారని, అమ్మమ్మ సంరక్షణలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల మధ్య తెలుగు మాధ్యమ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారని గుర్తుచేశారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరినా, అక్కడితో ఆగకుండా విధులు నిర్వర్తిస్తూనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమై భారతీయ పోలీసు సేవ (IPS)లో స్థానం సంపాదించారని వివరించారు. ఆయన విజయం కష్టపడి సాధించిన విజయమని, గ్రామీణ, వెనుకబడిన వర్గాల యువతకు అది ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
సివిల్ సర్వీసెస్లో ఎంపిక కావడం ద్వారా ఉద్యోగ హోదా మారుతుందే తప్ప, వ్యక్తిగత జీవితం ఒక్కసారిగా మారదని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి అకాడమీకి వచ్చిన యువ అధికారులు సామాజిక, మానసిక, భావోద్వేగ పరమైన ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారని చెప్పారు. అలాంటి సమయంలో శిక్షణ సంస్థలు కేవలం శిక్షించడానికే కాకుండా మార్గనిర్దేశం చేయడం, కౌన్సెలింగ్ అందించడం, మానసికంగా అండగా నిలవడం కూడా తమ బాధ్యతగా భావించాలని సూచించారు.
వ్యక్తిగత ప్రేమ సంబంధం విఫలమైతే దానిని వెంటనే క్రిమినల్ కేసుగా చూడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. విచారణలో నేరం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభిస్తే చట్టం తన పని చేయాలని, కానీ పరస్పర అంగీకారంతో కొనసాగిన సంబంధం విరగడైన నేపథ్యంలో తలెత్తిన వివాదాన్ని క్రిమినల్ కేసుగా మార్చకుండా చట్ట అమలు సంస్థలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. నేరానికి, వ్యక్తిగత సంబంధాల విభేదాలకు మధ్య తేడాను గుర్తించడం దర్యాప్తు సంస్థల ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే కేంద్ర హోంశాఖ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేయడంపై కూడా నాగేశ్వరరావు ప్రశ్నలు లేవనెత్తారు. ఒకవేళ పరస్పర అంగీకారంతో కొనసాగిన సంబంధానికి సంబంధించిన వ్యవహారమే అయితే, పరిపాలనా చర్యల్లో ఇద్దరిపైనా ఒకే విధమైన ప్రమాణాలు అమలు కావాలని, ఒక్క ఉదయ్పై మాత్రమే సస్పెన్షన్ విధించి మరో ట్రైనీపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సమానత్వ సూత్రానికి విరుద్ధంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సంస్థల విశ్వసనీయత సమాన న్యాయంతోనే నిలబడుతుందని అన్నారు.
ఈ వ్యవహారాన్ని సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ డీజీపీలు నిష్పాక్షికంగా, వేగంగా, సమగ్రంగా దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి, విచారణ పూర్తయ్యే వరకు ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్ను ఎత్తివేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.
ఉదయ్ కృష్ణారెడ్డి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ప్రయాణం అసాధారణ కృషికి నిదర్శనమని, విచారణ కొనసాగుతున్నంత కాలం ఆయనకు శిక్షణ కొనసాగించే అవకాశం కల్పిస్తే చట్టపరమైన ప్రక్రియకు భంగం కలగదని, అదే సమయంలో కష్టపడి నిర్మించుకున్న కెరీర్కు ముందస్తు నష్టం జరగకుండా ఉంటుందని నాగేశ్వరరావు తన పోస్టులో అభిప్రాయపడ్డారు.
: