సోషల్ మీడియాకు లక్ష్మణరేఖ తప్పనిసరి: బండి సంజయ్

  • తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా కట్టడికి చర్యలు
  • యూట్యూబ్ ముసుగులో సనాతన ధర్మంపై అర్బన్ నర్సల్స్ దాడి ఆందోళన కలిగిస్తోంది
  • అట్లాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే*
  • వ్యక్తిగత, విషపూరిత ప్రచారం పై ఉక్కుపాదం మోపుదాం
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
  • కేంద్ర మంత్రిని కలిసిన జనసేన ఎంపీ లింగమనేని రమేశ్
  • పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై బండి సంజయ్ ఆరా

న్యూఢిల్లీ వెలుతురు జూలై 21:

తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మంపై సోషల్ మీడియా ద్వారా దాడికి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. దీంతోపాటు టార్గెట్ చేసిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు విషపూరిత ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అందులో భాగంగా సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ లో కట్టుతప్పుతున్న సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు, జర్నలిజం ముసుగులో యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విష ప్రచారం నిర్వహిస్తున్న వారిపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని, దీనివల్ల సమాజానికి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

జనసేన తరపున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన లింగమనేని న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి నివాసంలో బండి సంజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా లింగమనేని రమేశ్ ను కేంద్ర మంత్రి శాలువాతో సన్మానించారు. ఇటీవల ముంబైల్ శస్త్ర చికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా వ్యవహరిస్తున్న తీరు, జర్నలిజం ముసుగులో కొందరు వ్యక్తులను టార్గెట్ చేస్తూ విష ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వ్యవహారం ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది.

అదే సమయంలో అర్బన్ నక్సల్స్ ముసుగులో కొందరు సనాతన ధర్మంపై దాడి చేస్తూ హైందవ సంస్కృతిని కించపరుస్తున్నారని, ఇలాంటి వారిపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోవడం చేతగానివాళ్లు, జర్నలిజం, మేధావుల ముసుగులో కొందరు అర్బన్ నక్సల్స్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ భారతీయ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వాలు చూసీ చూడనట్లు వ్యవహరిస్తే హైందవ సమాజానికి తీరని నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత దూషణలు, బూతులతో శ్రుతి మించుతున్న సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణ రూపొందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు.

Bandi SanjaySocial Media
Comments (0)
Add Comment