హుస్నాబాద్ అభివృద్ధికి మంత్రి పొన్నం చొరవ
కొండా సురేఖతో కీలక భేటీ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మంత్రి కొండా సురేఖ నివాసంలో సమావేశం
సమస్యల పరిష్కారానికి వినతిపత్రం
సహకారం అందిస్తామని మంత్రి సురేఖ హామీ
వినతిపత్రంలోని అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని స్పష్టీకరణ
నిబంధనలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతామని వెల్లడి
నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు
హైదరాబాద్ వెలుతురు జూలై 09:
హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాల పరిష్కారంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మంత్రి కొండా సురేఖ నివాసంలో ఆమెను కలిసి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన దేవాదాయ, అటవీ శాఖలతో ముడిపడి ఉన్న పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించిన పలు పెండింగ్ ఫైళ్ల ప్రస్తుత స్థితిని మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి కొండా సురేఖకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన పనులు వేగవంతం కావాలంటే ఆయా శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సమగ్ర వినతిపత్రాన్ని మంత్రి సురేఖకు అందజేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ వినతిపై స్పందించిన మంత్రి కొండా సురేఖ, హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తమ శాఖల పరిధిలో పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వినతిపత్రంలో ప్రస్తావించిన ప్రతి అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా అధికారులు తగిన చర్యలు చేపట్టేలా ఆదేశిస్తామని తెలిపారు.
దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంలో సమన్వయంతో ముందుకు సాగుతామని, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
ఈ భేటీతో హుస్నాబాద్ నియోజకవర్గంలో దేవాదాయ, అటవీ శాఖలతో సంబంధం ఉన్న పలు అభివృద్ధి పనులు, ప్రతిపాదనలకు త్వరలోనే ఊతం లభించే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
