మెట్రో విస్తరణను అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌, బీజేపీ : సీఎం రేవంత్ రెడ్డి

  • మెట్రో ఫేజ్‌-2 ఆలస్యానికి బీఆర్ఎస్‌, బీజేపీయే కారణమని విమర్శ
  •  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వైఖరిపై సీఎం తీవ్ర విమర్శలు
  • రుణాల మంజూరులో జాప్యం వల్లే విస్తరణ నిలిచిపోయిందని వ్యాఖ్య
  •  రూ.40 వేల కోట్లతో మెట్రో విస్తరణకు రాష్ట్రం సిద్ధమని వెల్లడి
  • కేంద్రం భాగస్వామ్యం లేకుండానే ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమన్న ప్రభుత్వం
  • కనీసం ఎన్‌వోసీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్రం
  • రాజకీయ లాభనష్టాల కోసమే మెట్రో ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపణ
  •  కేటీఆర్‌ సూచనల మేరకే కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శ
  •  అహ్మదాబాద్‌, విశాఖకు అనుమతులు.. హైదరాబాద్‌కు ఎందుకు లేవని ప్రశ్న
  • తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని సీఎం వ్యాఖ్య

హైదరాబాద్ వెలుతురు జూన్ 15:హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మెట్రో విస్తరణను భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్‌ కలిసి అడ్డుకుంటున్నాయని విమర్శించారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మెట్రో విస్తరణ ప్రతిపాదించిన ప్రాంతాలన్నీ బీజేపీ, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టుపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సమస్యలపై చర్చించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలుద్దామని ప్రయత్నించినప్పటికీ సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.

మెట్రో విస్తరణకు అవసరమైన రుణాల మంజూరు విషయంలో కేంద్రం సహకరించలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. రుణం బదిలీ కాకపోవడానికి కిషన్‌రెడ్డే కారణమని ఆరోపిస్తూ, ఈ అంశంపై ఆయన స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మెట్రో విస్తరణకు అవసరమైన నిధుల విడుదలపై బాధ్యత తీసుకుని మాట్లాడాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని సీఎం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక భాగస్వామ్యం లేకపోయినా ప్రాజెక్టును అమలు చేసేందుకు తాము సిద్ధమని, ఇందుకు అవసరమైన అనుమతులు మాత్రమే ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు.

రుణాలు మంజూరు చేయకపోయినా కనీసం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) అయినా ఇప్పించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, సహకారం అందిస్తే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని సన్మానించేందుకు కూడా సిద్ధమని వ్యాఖ్యానించారు.

మెట్రో విస్తరణ విషయంలో రాజకీయ కుట్ర జరుగుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుందనే కారణంతోనే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్‌, బీజేపీ మధ్య అవగాహన ఉందని విమర్శించారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభావంతోనే కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని సీఎం ఆరోపించారు. కేటీఆర్‌ సూచనల మేరకే కేంద్రమంత్రి పనిచేస్తున్నారని, మెట్రో ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న జాప్యానికి వారిద్దరే కారణమని పేర్కొన్నారు. కేటీఆర్‌ కుట్రలను కిషన్‌రెడ్డి అమలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా రవాణా వ్యవస్థలను ప్రోత్సహించాలని చెబుతున్నారని, అదే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ చేపట్టాలని చూస్తుంటే కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. ప్రధాని సూచనలను అమలు చేయడానికే తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

మెట్రో తొలి దశ ప్రాజెక్టును కేంద్రం స్వాధీనం చేసుకోవాలనుకుంటే తమకు అభ్యంతరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఫేజ్‌-2 నిర్మాణంపైనే దృష్టి సారించిందన్నారు. అహ్మదాబాద్‌, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు, నిధులు మంజూరు చేసినప్పుడు హైదరాబాద్‌ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

ఈ పరిణామాలన్నీ తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షకు నిదర్శనమని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నగర అభివృద్ధి, ప్రజా రవాణా సదుపాయాల విస్తరణకు అవసరమైన మెట్రో ప్రాజెక్టుకు తక్షణమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Reply

Your email address will not be published.