హిందుత్వం మతం కాదు.. జీవన విధానం: వెంకయ్యనాయుడు

  • ‘కర్మవీరులారా కదిలి రండి’ గీతావిష్కరణ
  • స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ప్రత్యేక కార్యక్రమం
  • హిందుత్వంపై మాజీ ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
  • జీవన విధానమని, సాంస్కృతిక వారసత్వమని వెల్లడి
  • ఐక్యత లోపిస్తే దేశ ప్రగతి వెనకబడుతుందని సూచ‌న‌

ఆంధ్రప్రదేశ్, వెలుతురు జూలై 30:

హిందుత్వం అనేది కేవలం ఒక నిర్దిష్ట మతం కాదని, అదొక గొప్ప జీవన విధానమని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో గురువారం నిర్వహించిన ‘కర్మవీరులారా కదిలి రండి’ అనే స్ఫూర్తిదాయక గీతావిష్కరణ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘విద్యార్థులతో మాట-మంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, నేటి యువత, సమాజ బాధ్యతలపై దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు.

దేశంలో ప్రతీ పౌరుడిలోనూ దేశభక్తి, సమాజ ఐక్యత భావనలు అత్యంత అవసరమని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. సమాజంలో ఐక్యత లోపించినప్పుడు దేశ ప్రగతి మందగిస్తుందని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మన సాంస్కృతిక మూలాలను గుర్తుంచుకుంటూనే, సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన మహోన్నతమైన జీవన విలువలను తర్వాతి తరాలకు అందించడమే హిందుత్వంలోని అసలైన సారాంశమని ఆయన అభిప్రాయపడ్డారు.యువత మంచి గీతాలను వినాలని, వాటిలోని భావాన్ని అర్థం చేసుకుని స్ఫూర్తి పొందాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. జాతీయ గేయం ‘వందేమాతరం’ మన భారతదేశ మూలాలకు, ఐక్యతకు దివ్యమైన సమాధానమని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రతి పౌరుడూ కంకణం కట్టుకుని పని చేయాలని, మాతృభూమి రుణం తీర్చుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఒక శక్తివంతమైన, వికసిత భారత్ రూపకల్పనలో నేటి యువతీ యువకుల పాత్రే అత్యంత కీలకమైనదని ఆయన నొక్కి చెప్పారు.

నేటి తరం యువత సమయాన్ని ఎక్కువగా మొబైల్ ఫోన్లు, యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపైనే గడుపుతుండటంపై ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ పరికరాలకు బానిసలు కాకుండా, విజ్ఞానాన్ని ప్రసాదించే పుస్తకాలను చదవ అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. జీవితంలో సరైన దారిలో నడవడానికి ప్రతి ఒక్కరూ ఒక మంచి గురువును ఎంచుకోవాలని సూచించారు. పుస్తకాలు, ఉత్తమ గురువులే మనిషిని జ్ఞానవంతుడిగా, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తీర్చిదిద్దుతాయని వెంకయ్యనాయుడు వివరించారు.యువత ఇతరులపై ఆధారపడకుండా తమ భవిష్యత్తును తామే స్వయంగా నిర్దేశించుకునే స్థాయికి ఎదగాలని మాజీ ఉప రాష్ట్రపతి ఆకాంక్షించారు. స్వయంశక్తి, ఆత్మవిశ్వాసం, నిరంతర శ్రమ ద్వారా మాత్రమే జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని చెప్పారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, నైతిక విలువలతో కూడిన ప్రగతి సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.