తెలంగాణ ఆర్‌అండ్‌బీ శాఖను దేశంలోనే ‘నంబర్‌వన్‌’గా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వెలుతురు నల్లగొండ జిల్లా,నకిరేకల్ జూలై 12:

తెలంగాణ ఆర్‌అండ్‌బీ శాఖను అన్ని రంగాల్లో నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్‌పల్లి మండల కేంద్రంలో 76 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నార్కట్‌పల్లి–మునుగోడు సేతుబంధన్ (సీఆర్‌ఐఎఫ్) రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన రహదారులు, వంతెనలు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షితమైన రవాణా వ్యవస్థను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొదటి సారి సేతు బంధన్ పథకం కింద 103 కోట్లు మంజూరు చేయించి అందులో 76 కోట్లు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం కేటాయించేలా చొరవ చూపినట్లు వెల్లడించారు.

నార్కట్ పల్లి మండలం తన సొంత మండలమని,తనకు రాజకీయ బిక్ష పెట్టిన ఈ గడ్డ రుణం అభివృద్ది పనులతో తీర్చుకుంటానని అన్నారు. నల్లగొండ జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, రోడ్లు, సాగునీరు, వ్యవసాయం, తదితర రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎక్కువ స్థాయిలో ధాన్యం పండిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాష్ట్రంలోనే
ధాన్యం అత్యధికంగా పండించిన జిల్లా నల్గొండ జిల్లా అని అన్నారు.

నార్కట్‌పల్లి–మునుగోడు రహదారి అభివృద్ధి పనుల్లో స్థానిక రైతుల భూములకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను దశలవారీగా పూర్తి చేసి నార్కట్‌పల్లి ప్రాంతాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనే రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతోందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నార్కెట్ పల్లి మండలంలో 600 కోట్లతో హ్యాం రోడ్లను,4000 కోట్లతో రాష్ట్రంలో అన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2028లో ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తి చేసి నార్కట్పల్లి మండల ప్రజలకు తాగునీరు, సాగు నీరు అందిస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, సేతు బందు సిఆర్ఐఎఫ్ చీఫ్ వసంత నాయక్ , స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ సి.ఈ వసంత్ నాయక్, ఎస్. ఈ శ్రీధర్ రెడ్డి, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.