తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీ.వీ. నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
నారాయణరావు కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకొని సినిమా రంగంలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనపై శిక్షణ తీసుకున్నారు. ఆయన 1976లో కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ‘అంతులేని కథ’ సినిమాతో నటుడిగా వెండి తెరకు పరిచయయ్యారు. నారాయణరావు నటించిన తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
జీవీ నారాయణరావు నటనతో పాటు నిర్మాతగా కూడా పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ‘దేవాంతకుడు’, ‘ఇంటికో రుద్రమ్మ’, ‘యముడికి మొగుడు’, ‘పెళ్లి నీకు శుభం నాకు’ వంటి సినిమాలను నిర్మించి చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపైనా తనదైన ముద్ర వేసి అనేక టెలివిజన్ సీరియల్స్లో నటించి కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
