పెద్దపల్లి జిల్లా అభివృద్ధి – ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు
పెద్దపల్లి వెలుతురు జూలై 04:
శనివారం రోజున పెద్దపల్లి కలెక్టరేట్లో జిల్లా పరిధిలో చేపట్టిన, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్ & పబ్లిక్ రిలేషన్స్) హార్కర వేణుగోపాల్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేసి ప్రజలకు సత్వర సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు.
అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతన అంబులెన్స్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హార్కర వేణుగోపాల్ రావు కలిసి ప్రారంభించారు. ఈ అంబులెన్స్ ద్వారా జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత వేగంగా అందనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ & పెద్దపల్లి ఎమ్మెల్యే సీ.హెచ్. విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
