హైదరాబాద్ వెలుతురు జులై 16:
హైదరాబాద్ మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వేదికగా సారంగీ ఫౌండేషన్ సమర్పణలో నగరానికి చెందిన దివ్యాంగ కళాకారిణి షేక్ నఫీస్ కుంచె నుంచి జాలువారిన కళా ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శన 16 జులై నుండి 18 వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 7 వరకు జరగనుంది.
మాస్కులర్ డిస్ట్రోఫీ(కండర క్షీణత) వ్యాధితో బాధ పడుతూ ముప్పై ఏళ్లుగా చీకటి గదికే పరిమితమైన షేక్ నఫీస్ ప్రతిభను గుర్తించిన సామజిక కార్యకర్త, సీనియర్ జర్నలిస్ట్ ఖాజా ఆఫ్రిది 2018లో వెలుగులోకి తెచ్చాడు. ఆమెకు కళల పట్ల ఉన్న నిబద్దతతో తాను ప్రాణం పోస్తున్న కళను ఆఫ్రిది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వేడుకలలో నిలబెట్టాడు.
తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2018లో రవీంద్రభారతిలో, 2021లో దేశ రాజధాని ఢిల్లీ, 2023లో దుబాయ్ వేదికగా వరల్డ్ ఆర్ట్ దుబాయ్ ఎగ్జిబిషన్లో ఖాజా ఆఫ్రిది సహాయ సహకారాలతో నఫీస్ చిత్రాలను ప్రదర్శించి వైకల్యం దేహానికే తప్ప ఎంచుకున్న లక్ష్యానికి కాదని నిరూపించింది. నాలుగు గోడలకే పరిమితమైన తన కళను ప్రపంచానికి చాటేందుకు మొదటి నుంచి కృషి చేస్తున్న సామాజికవేత్త ఖాజా ఆఫ్రిదికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.


