
పెద్దకొత్తపల్లి, వెలుతురు జూన్ 24: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి, చెన్నపురావుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటిలో కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలి విడతలో రూ.22,500 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కేటాయించినట్లు తెలిపారు. రెండవ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజకవర్గానికి 2 వేల ఇండ్ల చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు.
కులం, మతం, వర్గం, రాజకీయ అనుబంధం చూడకుండా అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తున్నామని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. ఇండ్ల నిర్మాణం చేపడుతున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం దశలవారీగా బిల్లులు చెల్లిస్తూ నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా వేలాది కుటుంబాలకు శాశ్వత గృహ భద్రత కల్పిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.