- దశలవారీగా లక్ష ఇండ్ల నిర్మాణం
- పైలట్ ప్రాజెక్టుగా నియోజకవర్గానికి వెయ్యి ఇండ్ల వరకు నిర్మాణం
- గ్రామీణ ప్రాంతాల్లో మొదలైన ఇందిరమ్మ ఇళ్ల విప్లవం
- ఇప్పుడు పట్టణ పేదల జీవితాల్లోకి
గ్రామీణ ప్రాంతాలల్లో ఇందిరమ్మ ఇండ్లతో పెద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ ప్రాధిలోని పేదల సొంతింటి స్వప్నాన్ని నిజం చేసేందుకు మరో చారిత్రాత్మక అడుగు వేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో దశల వారీగా లక్ష ఎల్.ఐ.జి. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని, ఇందుకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయం క్యూర్ పరిధిలో ఎల్ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పై హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్ల పథకానికి శ్రీకారం చూడుతున్నామని ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్తో కలిసి పథకానికి సంబంధించిన విదివిధానాలను, దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామని వివరించారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఎల్ఐజీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున ఆయా స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైన చోట వెయ్యి వరకు నిర్మిస్తామని తెలిపారు.
గత ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా, హైదరాబాద్ నగరానికి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో అరకొరగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడంవల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతామనే ఆందోళనతో చాలామంది అక్కడ నివసించలేకపోయారని అన్నారు.
తమ ప్రభుత్వం మాత్రం పేదల జీవన వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే, వారి ఉపాధి, పిల్లల విద్య, వైద్య సౌకర్యాలు, రవాణా వంటి అంశాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మిస్తున్నామని, ఆ స్థలములో వారికి వాటా ఇస్తూ యాజమాన్య హక్కు కల్పిస్తూ వారి కుటుంబాలకు శాశ్వత ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామన్నారు.
క్యూర్ పరిధిలో హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాలల్లో స్థలాలను గుర్తించడం జరిగిందని, ఈ స్థలాలను ఇప్పటికే హౌసింగ్ విభాగం పొజిషన్ లోకి తీసుకుందని, ఎక్కడ ఎన్ని ఇండ్లు, ఎన్ని అంతస్తులు నిర్మించాలి, ఒక్కో ప్లాట్ విస్తీర్ణం, బిల్డింగ్ డిజైన్ లను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చించి రెండు, మూడు రోజులల్లో తుది రూపును ఇస్తామని వెల్లడించారు.
