హైదరాబాద్, వెలుతురు జూలై 14:
ఫైర్ ఎన్ఓసీతో పాటు.. రెన్యూవల్స్ ఆన్లైన్లోనే జారీ చేసే ప్రక్రియకు హైడ్రా సోమవారం శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల మంజూరీ, పాత అనుమతుల పునరుద్ధరణ, వాటికి సంబంధించిన ఫీజుల చెల్లింపులు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరిగేలా చర్యలు తీసుకుంది. ఈ ఆన్లైన్ సేవల ప్రక్రియను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సోమవారం ప్రారంభించారు.
హైడ్రా కు సంబందించిన https://hydraafirenoc.telangana.gov.in వెబ్సైట్లోకి వెళ్లి అందులోనే నేరుగా సంబంధిత కాలమ్స్లో అడిగిన సమచారం అందజేస్తే సరిపోతుందని హైడ్రా ఒక ప్రకటనలో పేర్కొంది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్కు ఫైర్ ఎన్వోసీలతో పాటు వాటి రెన్యూవల్స్ను గతంలో జీహెచ్ ఎంసీ పరిధి వరకూ హైడ్రా జారీ చేస్తూ వచ్చేది. ఇప్పుడు గ్రేటర్హైదరాబాద్ మున్సిపల్ కార్పరేషన్తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)ఇలా క్యూర్ (కోర్ ఆర్బన్ రీజయన్ ఎకానమీ) పరిధిలోని మూడు కార్పొరేషన్లకు హైడ్రా సేవలను రాష్ట్ర ప్రభుత్వం విస్తరించింది. హైడ్రా కార్యాలయం వరకూ ఎవరూ రావాల్సిన పని లేదని పేర్కొంది.
ఫైర్ ఎన్వోసీతో పాటు, రెన్యూవల్స్కు సంబంధించిన దరఖాస్తును ఆన్లైన్లో నింపడంతో పాటు సంబంధిత పత్రాలను కూడా ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉందని హైడ్రా తెలిపింది. దరఖాస్తు దారుడు ఆన్లైన్లో అందజేసిన సమాచారం ప్రకారం ఫైర్ నిబంధనలను పాటించారా లేదా అనేది సంబంధిత అధికారులు క్షేత్రస్తాయిలో పరిశీలిస్తారని హైడ్రా పేర్కొంది. తర్వాత అనుమతులు మంజూరూ చేస్తూ ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. వాటిని దరఖాస్తు దారులు ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు హైడ్రా కల్పించింది.
ఈ కార్యక్రమంలో హైడ్రా ఫైర్ విభాగం అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఆర్ఎఫ్ఓ జయప్రకాష్, డీఎఫ్వోలు వై. గౌతం, ఎస్.శ్రీధర్ రెడ్డి, ఐటీ విభాగం ఇన్ఛార్జి బాచిరెడ్డి పాల్గొన్నారు.
