హైదరాబాద్, జూన్ 23 (వెలుతురు):
ఆర్మీకి చెందిన భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని, ఆ భూమిని కాపాడాలని రక్షణ శాఖకు చెందిన ఉన్నతాధికారులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ను ఆర్మీ లెఫ్ట్నెంట్ కల్నల్ జై సింగ్ కలసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, జీఎల్ఆర్ సర్వే నంబరు 507లోని ఆర్మీకి చెందిన ఏ-1 భూమి ఉండగా అందులో ఆక్రమణలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్మీకి చెందిన భూమిని ఆక్రమించి జి ప్లస్ 2 భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు.
ఆ నిర్మాణానికి అనుమతులు కూడా లేవని పేర్కొన్నారు. వెంటనే నిర్మాణాలను ఆపించి ఆ స్థలాన్ని కాపాడాలని కోరారు. వినతిపత్రాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆక్రమణలను నిర్ధారించుకున్న తర్వాత చర్యలు తీసుకోవాలని హైడ్రా అధికారులను ఆదేశించారు. ఈ భేటీలో హైడ్రా ఏసీపీ ఉమామహేశ్వర రావు ఉన్నారు.
