- ఢిల్లీలో కాంగ్రెస్ వరుస సమావేశాలు
- మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్తో కీలక చర్చలు?
- ఆగస్టు 15 తర్వాత విస్తరణకు సంకేతాలు
- రెండు మంత్రి పదవుల భర్తీపై చర్చ
- హైకమాండ్తో తెలంగాణ నేతల భేటీ
- కడియం-కొండా వివాదంపై అసంతృప్తి
- తుంగతుర్తి అంశంపైనా సమీక్ష
- పార్టీ క్రమశిక్షణపై హైకమాండ్ హెచ్చరిక
ఢిల్లీ, వెలుతురు (జూన్ 29):
ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ వరుస సమావేశాలు నిర్వహించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పార్టీ-ప్రభుత్వ సమన్వయం, అంతర్గత విభేదాలు వంటి కీలక అంశాలపై అధిష్ఠానం నేతలతో తెలంగాణ నాయకులు చర్చించినట్లు సమాచారం.
ఆగస్టు 15 తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేసేందుకు హైకమాండ్ అనుమతి కోరాలని తెలంగాణ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశాలకు ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై వారు అధిష్ఠానానికి వివరించినట్లు సమాచారం.
మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశంతో పాటు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న విభేదాలపైన హైకమాండ్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గతంగా పరిష్కరించాల్సిన విషయాలను బహిరంగంగా చర్చించడం సరికాదని, అలాంటి చర్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
పార్టీ లైన్ దాటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం సహించబోమని హైకమాండ్ హెచ్చరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ పనితీరు, పార్టీ వ్యవహారాలు సమన్వయంతో ముందుకు సాగాలని, నాయకులందరూ క్రమశిక్షణ పాటించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.
