పాలకులారా: వానలు క్షుద్ర పూజలతో రావు!

ప్రకృతి, సమాజం, చరిత్ర-మూడూ తమ అంతర్గత నియమాల ప్రకారమే మార్పుకు లోనవుతాయని గతితార్కిక భౌతికవాదం వివరిస్తుంది. వర్షాభావానికి కారణం క్షుద్ర శక్తులు కాదు, ప్రకృతి–సమాజ సంబంధాల్లో మనిషి జోక్యం, వాతావరణ మార్పులు, పర్యావరణ విధ్వంసం. కారణాలను శాస్త్రంలో వెతకాల్సిన చోట, వాటిని మూఢనమ్మకాలలో వెతకడం సమాజాన్ని వాస్తవ సమస్యల పరిష్కారం నుంచి దూరం చేస్తుంది.

తెలంగాణ సమాజాన్ని పరిశీలిస్తే, ఇక్కడ లోతైన హేతువాద సంప్రదాయాలు, గొలుసుకట్టు చెరువుల ఆధారిత సాంప్రదాయ నీటి నిర్వహణ వ్యవస్థలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం చారిత్రక పునాదులుగా కనిపిస్తాయి. ప్రజల జీవనం ఎప్పుడూ ప్రకృతి నియమాలను, భౌతిక వనరులను అర్థం చేసుకోవడం పైనే ఆధారపడి సాగింది. వర్షపాతం అనేది క్షుద్ర పూజలతోనో, అవైజ్ఞానిక భావనలతోనో నిర్ణయించబడేది కాదు; అది పూర్తిగా భూ-వాతావరణ శాస్త్రానికి లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియ. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలి పీడనం, తేమ శాతాలు, ‘ఎల్ నినో’, ‘లా నినా’ వంటి సంక్లిష్ట వాతావరణ పరిణామాలపై వర్షాలు ఆధారపడి ఉంటాయి. దీనికితోడు అనియంత్రిత అటవీ నిర్మూలన, జలవనరుల ఆక్రమణ, పారిశ్రామిక కాలుష్యం వల్ల స్థానిక వాతావరణ సమతుల్యత దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు స్పష్టమైన ఆధారాలతో నిరూపించారు. ప్రకృతితో అనుసంధానమై, హేతుబద్ధమైన జల సంరక్షణ సంప్రదాయాలున్న తెలంగాణ నేలపై, వర్షాలు రాకపోవడానికి “క్షుద్ర పూజలే” కారణమని మాట్లాడటం ఇక్కడి జీవన స్ఫూర్తిని, పర్యావరణ శాస్త్ర పునాదులను విస్మరించడమే.

పర్యావరణ విధ్వంసం అనేది ఏదో స్వతంత్రంగా జరిగే ప్రమాదం కాదు; అది పాలకవర్గ ఆర్థిక ప్రయోజనాలతో బిగుసుకుపోయిన ఒక గొలుసు. అడవుల నరికివేత వెనుక కార్పొరేట్ మైనింగ్ లీజులు ఉన్నాయి. జలవనరుల ఆక్రమణ వెనుక రియల్ ఎస్టేట్, ప్రత్యేక ఆర్థిక మండళ్ల విస్తరణ ఉంది. పారిశ్రామిక కాలుష్యం వెనుక కాలుష్య నియంత్రణ మండళ్లను నీరుగార్చిన విధాన నిర్ణయాలు ఉన్నాయి. అంటే వర్షాభావం కేవలం వాతావరణ శాస్త్ర సమస్య మాత్రమే కాదు; అది భూమి, నీరు, అడవులపై పెట్టుబడిదారీ నియంత్రణ సాధించే రాజకీయ ఆర్థిక వ్యవస్థ ఫలితం. ఈ పరస్పర సంబంధాన్ని విస్మరించి, వర్షం రాకపోవడాన్ని కేవలం “ప్రకృతి వైపరీత్యం”గానో, “పూజలు చేయకపోవడం”గానో చిత్రించడం పాలకవర్గం తన సొంత విధాన వైఫల్యాలను, తన సొంత మూలధన ప్రయోజనాలను కప్పిపుచ్చుకునే ఎత్తుగడ మాత్రమే.

ఈ మూఢనమ్మకాల రాజకీయం ఈనాడు ఆకస్మికంగా పుట్టుకొచ్చింది కాదు; ఇది దశాబ్దాలుగా సాగుతున్న ఒక చారిత్రక ప్రక్రియ ఫలితం. హరిత విప్లవం అనంతరం భూగర్భ జలాలపై అతిగా ఆధారపడటం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ అవినీతి, చెరువుల పూడికతీత నిర్లక్ష్యం ఇవన్నీ క్రమంగా పేరుకుపోతూ వచ్చాయి. ఒకప్పుడు నీటిపారుదల ఉద్యమాలు, చెరువుల సామాజిక నిర్వహణ వ్యవస్థలు ఉండేవి. పెట్టుబడిదారీ, భూస్వామ్య ప్రయోజనాలు బలపడుతున్న కొద్దీ ఆ సామూహిక వ్యవస్థలు కూలిపోయి, వ్యక్తిగత బోరుబావుల మీద, ఆ తర్వాత దైవ ప్రార్థనల మీద ఆధారపడే స్థితికి సమాజం చేరుకుంది. అంటే మూఢనమ్మకాల ప్రచారం శాస్త్రీయ నిర్వహణ వ్యవస్థలు కూలిపోతూ వచ్చిన చారిత్రక చలనానికి పర్యవసానమే తప్ప, స్థిరమైన సాంస్కృతిక లక్షణం కాదు.

నేడు సమాజంలో మత ఛాందసవాదం బలంగా బయలుదేరుతున్న క్రమంలో, అలాంటి అవైజ్ఞానిక రాజకీయాలను మరింత విస్తృతం చేయడంలో పాలకవర్గాలు కీలకంగా వ్యవహరించడం తీవ్రమైన ఆందోళనకరం. పాలనా వైఫల్యాలను, జల యాజమాన్య లోపాలను కప్పిపుచ్చుకోవడానికి మూఢనమ్మకాల ప్రచారాన్ని ఆశ్రయించడం అత్యంత తప్పుడు సిద్ధాంతం. ఇక్కడ ఒక స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తోంది: జాతీయ స్థాయిలో ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధమైన శాస్త్రీయ దృక్పథం (సైంటిఫిక్ టెంపర్), హేతుబద్ధత, సామాజిక న్యాయం గురించి నిలకడగా మాట్లాడుతుంటే, ప్రాంతీయ స్థాయిలోని నాయకులు దానికి పూర్తి భిన్నంగా మూఢనమ్మకాలను ప్రోత్సహించే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకే రాజకీయంలో ఉంటూ జాతీయ స్థాయిలో శాస్త్రీయ స్ఫూర్తిని, ప్రాంతీయ స్థాయిలో అవైజ్ఞానిక ధోరణులను భుజానకెత్తుకోవడం తీవ్రమైన వైరుధ్యానికి, ద్వంద్వ ప్రమాణాలకు ప్రత్యక్ష నిదర్శనం.

సంవత్సరం సంవత్సరం పేరుకుపోతున్న వర్షాభావం, ప్రతిసారీ దానికి ఇచ్చే మూఢనమ్మకాల సాకులు కేవలం పరిమాణాత్మక పునరావృతాలు కావు. ఈ పరిమాణాత్మక పేరుకుపోవడం ఒక కీలక మలుపు వైపు సమాజాన్ని నెడుతోంది: ప్రజల్లో పాలనా వ్యవస్థపై, రాజ్యాంగబద్ధ సంస్థలపై విశ్వాసం క్రమంగా కరిగిపోవడం. ప్రతి కరవుకూ శాస్త్రీయ పరిష్కారం కాకుండా క్షుద్ర పరిష్కారం ముందుకు వచ్చినప్పుడు, అది కేవలం ఒక తప్పుడు ప్రకటన కాదు; పాలనా చట్టబద్ధత క్రమంగా కోల్పోతున్న సంకేతం. ఈ పరిమాణాత్మక కోతలు కొనసాగితే, అది గుణాత్మకంగా ఒక దశకు చేరుతుంది, ప్రజలు రాజ్యాంగ సంస్థలనే కాక, రాజ్యాన్నే ప్రశ్నించే దశకు. అందుకే ఈ చిన్న క్షుద్ర వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోలేం, అవి పేరుకుపోతున్న సంక్షోభానికి లక్షణాలు.

అధికారంలో ఉన్నవారైనా, ప్రతిపక్షంలో ఉన్నవారైనా ఏ వర్గానికి చెందిన పాలకులైనా గ్రహించాల్సిన ప్రాథమిక సత్యం ఒకటే: సమాజం అభివృద్ధి పథంలో ముందుకు ప్రయాణించాలంటే శాస్త్రీయ దృక్పథం అత్యంత అవసరం. భారత రాజ్యాంగంలోని అధికరణ 51A(h) ప్రకారం ప్రతి పౌరుడిలో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని, పరిశోధనా స్ఫూర్తిని పెంపొందించడం ప్రాథమిక విధి. ప్రజాప్రతినిధులు ఈ రాజ్యాంగ ఆదేశానికి కట్టుబడి ఉండాలి. మూఢనమ్మకాలతో సమాజం వెనక్కి పోతుందే తప్ప అభివృద్ధి చెందదు. అడవులను సంరక్షించడం, చెరువులను-నదులను కాపాడుకోవడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన ప్రణాళికలు రూపొందించడమే నిజమైన పరిష్కారం. రాజకీయ నాయకులు సంచలనాత్మక క్షుద్ర రాజకీయ వ్యాఖ్యలను పక్కనబెట్టి, శాస్త్రీయ ఆధారాలతో కూడిన బాధ్యతాయుతమైన పరిపాలన అందించడమే రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజలకు చేసే నిజమైన సేవ. వానలు క్షుద్ర పూజలతో రావు… ప్రకృతి శాస్త్రంతోనే వస్తాయి!


పాపని నాగరాజు
(సత్యశోధక మహాసభ)
9948872190

Leave A Reply

Your email address will not be published.