– ఏజెన్సీ నియోజకవర్గాలకు మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వండి
– సీఎం రేవంత్ను కోరిన గిరిజన ఎమ్మెల్యేలు
– ఏజెన్సీ ప్రాంతాలకు అదనపు ఇళ్ల కేటాయింపు విజ్ఞప్తి
– సీతక్క నేతృత్వంలో సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు
– డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వినతిపత్రం
– పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి
– ఇందిర గిరి జల వికాసం అమలు చేయాలని డిమాండ్
– ఐటీడీఏలను మరింత బలోపేతం చేయాలని సూచన
– ఆశ్రమ పాఠశాలలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని అభ్యర్థన
– గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కోరిన ప్రజాప్రతినిధులు
– గిరిజన సంక్షేమంపై సమగ్ర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాద్ వెలుతురు జూలై 02:
ఏజెన్సీ ప్రాంతంలోని శాసనసభ నియోజకవర్గాలకు అదనంగా 2 వేల ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేల బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించింది.
ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగు చేస్తున్న పోడు భూములకు అర్హులైన గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని, అలాగే ”ఇందిర గిరి జల వికాసం” పథకాన్ని అమలు చేసి గిరిజన ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలను (ఐటీడీఏలు) మరింత బలోపేతం చేయాలని, గిరిజన విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఆశ్రమ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయి వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యేలు సూచించారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఉన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొన్నారు.
