రాజమహేంద్రవరం కారు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి

  • కిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి
  • మధ్యాహ్నం 3.25 గంటలకు తుదిశ్వాస
  • ఈ నెల 3న ప్రమాదంలో తీవ్ర గాయాలు
  • మద్యం మత్తులో కారు నడిపిన యువకులు
  • ప్రియాంక తలకు తీవ్ర గాయాలు
  • గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలింపు
  • పోస్టుమార్టం తర్వాత కుటుంబానికి అప్పగింత
  • ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
  • నిందితులకు కఠిన శిక్షలు తప్పవన్న సీఎం
  • కుటుంబానికి అండగా ఉంటామని హామీ

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 9:

రాజమహేంద్రవరం కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక కన్నుమూశారు. సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఆమె మృతితో కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ప్రియాంక మృతదేహాన్ని కిమ్స్‌ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించనున్నారు. రాజమహేంద్రవరం పోలీసులు, ఆమె తండ్రి వెంకటేశ్‌ వచ్చిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తదుపరి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

ప్రియాంక స్వస్థలం గద్వాల జిల్లాలోని అయిజ మండలం ఎక్లాస్‌పూర్ గ్రామం. ప్రస్తుతం ఎంబీబీఎస్‌ పూర్తి చేసి తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

ఈ నెల 3న రాత్రి ప్రియాంక తన సహచర విద్యార్థి ఉమేష్‌తో కలిసి రాజమహేంద్రవరం ప్రసాద్‌ ఆదిత్య మాల్‌లో సినిమా చూసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. థియేటర్‌ గేటు వద్ద రద్దీ కారణంగా వాహనాలు నిలిచిపోయిన సమయంలో ప్రమాదం జరిగింది.

నామవరానికి చెందిన సురవరపు దుష్యంత్‌, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్‌ మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చి ప్రియాంక ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కింద పడిపోయిన ప్రియాంకపై కారు తోలుకుంటూ వెళ్లారు. దీంతో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రియాంక తలకు తీవ్ర గాయమై కోమాలోకి వెళ్లింది.

ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బుధవారం ఆమెను మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు.

ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. ప్రియాంక కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిర్లక్ష్యంగా, మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు పోలీసు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అసలు ఏం జరిగింది 

ఆగష్టు 3వ తేదీ రాత్రి డాక్టర్ ప్రియాంక తన స్నేహితురాలితో కలిసి రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ మల్టీప్లెక్స్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ దారుణ సంఘటనల పరంపర చోటుచేసుకుంది. వారు తమ బైక్‌పై మాల్ నుండి బయలుదేరుగా ప్రమాదం జరిగింది.

మద్యం మత్తులో ఉన్న యువకులు మొదట డాక్టర్ ప్రియాంక, ఆమె స్నేహితురాలు నడుపుతున్న బైక్‌ను తమ కారుతో నిదానంగా ఢీకొట్టారు. దీంతో ఆగ్రహించిన డాక్టర్ ప్రియాంక డ్రైవర్లను ప్రశ్నించగా, ఆ యువకులకు కోపం వచ్చింది. ఆవేశంతో యువకులు నడుపుతున్న కారు, డాక్టర్ ప్రియాంక ద్విచక్ర వాహనాన్ని రెండోసారి ఢీకొట్టింది. ఆ భయంకరమైన ఢక్కాకు ఆమె ఫుట్‌పాత్‌పై పడిపోగా, ఆ వాహనం ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర తల గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన వెంటనే డాక్టర్ ప్రియాంకను మొదట రాజమండ్రిలోని ఒక స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గత ఏడు రోజులుగా న్యూరోక్రిటికల్ కేర్ నిపుణుల ప్రత్యేక బృందం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ, ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటల ప్రాంతంలో ఆమె మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రతిభావంతురాలైన యువ వైద్యురాలిని కోల్పోవడం ఆమె తండ్రిని, ఇతర కుటుంబ సభ్యులను తీవ్రంగా కుంగదీసింది. మద్యం తాగి వాహనం నడపడం వల్ల జరిగిన ఈ అర్థరహితమైన నష్టానికి విలపిస్తూ, ఆమె తండ్రి వెంకటేష్ మీడియా ముందు కన్నీటితో కుప్పకూలిపోయారు. ఈ ఘటన అనంతరం నిందితులైన సురవరపు దుష్యంత్‌, ఆండ్రూ జోసెఫ్‌లను అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచి, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. విద్యార్థి సంఘాలు, వైద్య సంఘాలు, పౌరులు మద్యం తాగి వాహనాలు నడపడాన్ని ఏమాత్రం సహించరాని రీతిలో కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ ఇద్దరు యువకులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.